عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

Taha [Taha] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah Taha [Taha] Ayah 135 Location Maccah Number 20

తాహా![1]

మేము ఈ ఖుర్ఆన్ ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి కాదు.[1]

కేవలం (అల్లాహ్ కు) భయపడే వారికి హితబోధ చేయటానికే!

ఇది (ఈ ఖుర్ఆన్) భూమినీ మరియు అత్యున్నతమైన ఆకాశాలనూ సృష్టించిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి క్రమక్రమంగా అవతరింపజేయబడింది.

ఆ కరుణామయుడు, సింహాసనం (అర్ష్)పై ఆసీనుడై ఉన్నాడు.[1]

ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ మరియు ఆ రెండింటి మధ్యనూ, ఇంకా నేల క్రిందనూ ఉన్న,[1] సమస్తమూ ఆయనకు చెందినదే.

మరియు నీవు బిగ్గరగా మాట్లాడితే (ఆయన విననే వింటాడు); వాస్తవానికి, ఆయనకు రహస్యంగా (చెప్పుకునే మాటలే గాక) అతి గోప్యమైన మాటలు కూడా, తెలుస్తాయి.[1]

అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అత్యుత్తమమైన పేర్లు ఉన్నాయి.[1]

ఇక మూసా వృత్తాంతం నీకు అందిందా? [1]

అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు:[1] "ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొని వస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు!"

అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు:[1] "ఓ మూసా!

నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా[1] లోయలో ఉన్నావు.

మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను.

నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు.

నిశ్చయంగా, తీర్పు ఘడియ రానున్నది, ప్రతి వ్యక్తీ తాను చేసిన కర్మల ప్రకారం ప్రతిఫలం పొందటానికి; నేను దానిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించాను.[1]

కావున దానిని విశ్వసించకుండా, తన మనోవాంఛలను అనుసరించేవాడు, నిన్ను దాని (ఆ ఘడియ చింత) నుండి మరలింపనివ్వరాదు; అలా అయితే నీవు నాశనానికి గురి కాగలవు.

మరియు ఓ మూసా! నీ కుడిచేతిలో ఉన్నది ఏమిటి?"

(మూసా) అన్నాడు: "ఇది నా చేతికర్ర, దీనిని ఆనుకొని నిలబడతాను మరియు దీనితో నా మేకల కొరకు ఆకులు రాల్చుతాను. మరియు దీని నుండి నాకు ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి."

(అల్లాహ్) అన్నాడు: "ఓ మూసా! దానిని భూమి మీద పడవేయి."

అప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా[1] మారిపోయి చురుకుగా చలించసాగింది.

(అల్లాహ్) ఆజ్ఞాపించాడు: "దానిని పట్టుకో, భయపడకు. మేము దానిని దాని పూర్వస్థితిలోకి మార్చుతాము.

మరియు నీ చేతిని చంకలో పెట్టి తీయి, దాని కెలాంటి బాధ కలుగకుండా, అది తెల్లగా మెరుస్తూ బయటికి వస్తుంది,[1] ఇది రెండవ అద్భుత సూచన!

ఇదంతా మేము నీకు మా గొప్ప సూచనలను చూపటానికి!

నీవు ఫిర్ఔన్ వద్దకు పో! నిశ్చయంగా అతడు మితిమీరి పోయాడు."[1]

(మూసా) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! నా హృదయాన్ని వికసింపజేయి.

మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి.

నా నాలుకలోని ముడిని (ఆటంకాన్ని) తొలగించు.

(దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి.

మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు.[1]

నా సోదరుడైన హారూన్ ను.

అతని ద్వారా నా బలాన్ని దృఢపరచు.

మరియు అతనిని నా వ్యవహారంలో సహాయకారిగా (భాగస్వామిగా) చేయి.

మేము నీ పవిత్రతను బాగా కొనియాడటానికి;

మరియు నిన్ను అత్యధికంగా స్మరించటానికి;

నిశ్చయంగా, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కని పెట్టుకునే ఉంటావు!"

(అల్లాహ్) సెలవిచ్చాడు: "ఓ మూసా! వాస్తవంగా, నీవు కోరినదంతా నీకు ఇవ్వబడింది.

మరియు వాస్తవానికి మేము నీకు మరొకసారి ఉపకారం చేశాము.[1]

అప్పుడు మేము నీ తల్లికి ఇవ్వవలసిన ఆ సూచనను ఈ విధంగా సూచించాము:

ఇతనిని (ఈ బాలుణ్ణి) ఒక పెట్టెలో పెట్టి దానిని (ఆ పెట్టెను) నదిలో విడువు. నది దానిని ఒక ఒడ్డుకు చేర్చుతుంది; దానిని నాకు మరియు ఇతనికి శత్రువు అయిన వాడు తీసుకుంటాడు.; మరియు నేను నా తరఫు నుండి నీ మీద ప్రేమను కురిపించాను మరియు నిన్ను నా కంటి మందు పోషింపబడేటట్లు చేశాను.[1]

అప్పుడు నీ సోదరి (నిన్ను) అనుసరిస్తూ పోయి, వారితో ఇలా అన్నది: 'ఇతనిని పెంచి పోషించగల ఒకామెను నేను మీకు చూపనా?'[1] ఈ విధంగా మేము నిన్ను మళ్ళీ నీ తల్లి దగ్గరకు చేర్చాము, ఆమె కళ్ళకు చల్లదనమివ్వటానికి, ఆమెను దుఃఖపడకుండా ఉంచటానికి.[2] మరియు నీవొక వ్యక్తిని చంపావు,[3] మేము ఆ ఆపద నుండి నీకు విముక్తి కలిగించాము. మేము నిన్ను అనేక విధాలుగా పరీక్షించాము.[4] ఆ తరువాత నీవు ఎన్నో సంవత్సరాలు మద్ యన్ వారితో ఉంటివి.[5] ఓ మూసా! ఇప్పుడు నీవు (మా) నిర్ణయానుసారంగా (ఇక్కడికి) వచ్చావు.

మరియు నేను నిన్ను నా (సేవ) కొరకు ఎన్నుకున్నాను.

నీవు మరియు నీ సోదరుడు నా సూచనలతో వెళ్ళండి. నన్ను స్మరించటంలో అశ్రద్ధ వహించకండి.[1]

మీరిద్దరు ఫిర్ఔన్ దగ్గరకు వెళ్ళండి. అతడు మితమీరి ప్రవర్తిస్తున్నాడు.

కాని అతనితో మృదువుగా మాట్లాడండి. బహుశా అతడు హితబోధ స్వీకరిస్తాడేమో, లేదా భయపడతాడేమో!"[1]

(మూసా మరియు హారూన్) ఇద్దరూ ఇలా అన్నారు: "ఓ మా ప్రభూ! వాస్తవానికి, అతడు మమ్మల్ని శిక్షిస్తాడేమోనని, లేదా తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడేమోనని మేము భయపడుతున్నాను!"

(అల్లాహ్) సెలవిచ్చాడు: "మీరిద్దరు భయపడకండి, నిశ్చయంగా, మీరిద్దరితో పాటు నేనూ ఉన్నాను. నేను అంతా వింటూ ఉంటాను మరియు అంతా చూస్తూ ఉంటాను.

కావున మీరిద్దరూ అతని వద్దకు పోయి ఇలా అనండి: "నిశ్చయంగా, మేమిద్దరం నీ ప్రభువు యొక్క సందేశహరులము. కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు.[1] మరియు వారిని బాధ పెట్టకు. వాస్తవానికి మేము నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుండి సూచనలు తీసుకొని వచ్చాము. మరియు సన్మార్గాన్ని అనుసరించే వానిపై (అల్లాహ్ తరపు నుండి) శాంతి వర్ధిల్లుతుంది![2]

" 'నిశ్చయంగా, ఎవడైతే సత్యాన్ని తిరస్కరించి వెనుదిరిగి పోతాడో, అతనికి కఠినశిక్ష తప్పక ఉంటుంది' అని వాస్తవానికి మాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపబడింది."

(ఫిర్ఔన్) అన్నాడు: "ఓ మూసా! మీ ఇరువురి ప్రభువు ఎవరు?"

(మూసా) జవాబిచ్చాడు: "ప్రతి దానికి దాని రూపాన్నిచ్చి, తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు."

(ఫిర్ఔన్) అన్నాడు: "అయితే పూర్వం గతించిన తరాల వారి సంగతి ఏమిటి?"

(మూసా) జవాబిచ్చాడు: "వాటి జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో (వ్రాయబడి) వుంది. నా ప్రభువు పొరపాటు చేయడు మరియు మరువడు కూడాను."

ఆయనే మీ కొరకు భూమిని చదునుగా (పరువుగా) జేసి, అందులో మీకు (నడవటానికి) త్రోవలను ఏర్పరిచాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించాడు. మేము దాని ద్వారా రకరకాల వృక్షకోటిని పుట్టించాము.[1]

మీరు వాటిని తినండి మరియు మీ పశువులకు మేపండి. నిశ్చయంగా, అర్థం చేసుకోగలవారికి ఇందులో అనేక సూచనలున్నాయి.

దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము.[1]

మరియు వాస్తవానికి, మేము అతనికి (ఫిర్ఔన్ కు) మా సూచనలన్నీ చూపాము, కాని అతడు వాటిని అబద్దాలన్నాడు మరియు తిరస్కరించాడు.

(ఫిర్ఔన్) ఇలా అన్నాడు: "ఓ మూసా! నీవు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా దేశం నుండి వెడల గొట్టటానికి మా వద్దకు వచ్చావా?[1]

సరే! మేము కూడా దాని వంటి మంత్రజాలాన్ని నీకు పోటీగా తెస్తాము; కావున మా మధ్య నీ మధ్య (సమావేశానికి) ఒక సమయం మరియు స్థలాన్ని నిర్ణయించు. దాని నుండి మేము కానీ నీవు కానీ వెనుకాడ కూడదు. మరియు అదొక యుక్తమైన స్థలమై ఉండాలి."

(మూసా) అన్నాడు: "మీతో సమావేశం ఉత్సవ దినమున నియమించుకుందాము. ప్రొద్దెక్కే వరకు ప్రజలందరూ సమావేశమై ఉండాలి."

ఆ పిదప ఫిర్ఔన్ వెళ్ళిపోయి తన తంత్ర సామగ్రిని సమీకరించుకొని తిరిగి వచ్చాడు.[1]

మూసా వారితో అన్నాడు: "మీరు నాశనమవుగాక! అల్లాహ్ పై అబద్ధాలు కల్పించకండి! అలా చేస్తే ఆయన కఠినశిక్షతో మిమ్మల్ని నిర్మూలించవచ్చు! (అల్లాహ్ పై) అబద్ధాలు కల్పించేవాడు తప్పక విఫలుడవుతాడు."

(ఇది విన్న) తరువాత వారు ఆ విషయాన్ని గురించి తర్కించుకున్నారు, కాని తమ చర్చను రహస్యంగానే సాగించారు.

(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడుకున్నారు: "వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడల గొట్టి, మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించ గోరుతున్నారు.[1]

కావున మీరు మీ యుక్తులను సమీకరించుకొని సమైక్యంగా (రంగంలోకి) దిగండి. ఈనాడు ప్రాబల్యం పొందిన వాడే, వాస్తవానికి సాఫల్యం (గెలుపు) పొందిన వాడు."[1]

వారు (మాంత్రికులు) ఇలా అన్నారు: "ఓ మూసా! నీవు విసురుతావా, లేదా మేము మొదట విసరాలా?"

(మూసా) అన్నాడు: "లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ - వారి మంత్రజాలం వల్ల - అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి.[1]

దానితో మూసాకు, తన మసనస్సులో కొంత భయం కలిగింది.[1]

మేము (అల్లాహ్) అన్నాము: "భయపడకు! నిశ్చయంగా నీవే ప్రాబల్యం పొందుతావు.[1]

నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మాంత్రికుని తంత్రమే! మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!"

అప్పుడు ఆ మాంత్రికులు సాష్టాంగం (సజ్దా)లో పడుతూ అన్నారు: "మేము హారూన్ మరియు మూసాల ప్రభువును విశ్వసించాము."[1]

(ఫిర్ఔన్) అన్నాడు: "నేను అనుమతించక ముందే, మీరు ఇతనిని విశ్వసించారా?[1] నిశ్చయంగా, ఇతనే మీకు మంత్రజాలం నేర్పిన గురువు! కావున ఇప్పుడు నేను మీ అందరి చేతులను మరియు కాళ్ళను వ్యతిరేక పక్షల నుండి నరికిస్తాను[2] మరియు మిమ్మల్ని అందరినీ, ఖర్జూరపు దూలాల మీద సిలువ (శూలారోహణ) చేయిస్తాను. అప్పుడు మా ఇద్దరిలో ఎవరి శిక్ష ఎక్కువ కఠినమైనదో మరియు దీర్ఘకాలికమైనదో మీకు తప్పక తెలియగలదు."

వారు (మాంత్రికులు) అన్నారు: "మా వద్దకు వచ్చిన స్పష్టమైన సూచనలను మరియు మమ్మల్ని సృజించిన ప్రభువు (అల్లాహ్)ను వదలి, మేము నీకు ప్రాధాన్యతనివ్వము. నీవు చేయ దలచు కున్నది చేసుకో! నీవు కేవలం ఐహిక జీవితాన్ని మాత్రమే అంతమొందించ గలవు. [1]

నిశ్చయంగా, మేము మా ప్రభువునందే విశ్వాసముంచాము, ఆయన (అల్లాహ్) యే మా తప్పులను మరియు నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలను క్షమించేవాడు. (ప్రతి ఫలమివ్వటంలో) అల్లాహ్ యే సర్వశ్రేష్ఠుడు మరియు శాశ్వతంగా ఉండేవాడు (నిత్యుడు)."[1]

నిశ్చయంగా, తన ప్రభువు ముందు పాపాత్ముడిగా హాజరయ్యే వాడికి తప్పక నరకం గలదు. అందులో వాడు చావనూ లేడు, బ్రతకనూ లేడు!

ఎవడైతే విశ్వాసిగా హాజరవుతాడో మరియు సత్కార్యాలు చేసి ఉంటాడో,[1] అలాంటి వారికి ఉన్నత స్థానాలుంటాయి -

శాశ్వతమైన స్వర్గవనాలు! వాటి క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే పుణ్యవంతులకు దొరికే ప్రతిఫలం.

మరియు వాస్తవానికి, మేము మూసాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలిపాము:[1] "నా దాసులను రాత్రివేళ తీసుకొని బయలుదేరు మరియు వారి కొరకు సముద్రం నుండి తడిలేని మార్గాన్ని ఏర్పరచు; వెంబడించి పట్టుబడతావేమోనని భయపడకు, (సముద్రంలో మునిగి పోతావేమోనని కూడా) భీతి చెందకు."[2]

ఆ పిదప ఫిర్ఔన్ తన సేనలతో వారిని వెంబడించి (అక్కడికి) చేరగానే, సముద్రం వారిని హఠాత్తుగా అలుముకొని క్రమ్ముకున్నది.

మరియు ఫిర్ఔన్ తన జాతి ప్రజలను మార్గభ్రష్టులుగా చేశాడు మరియు వారికి సన్మార్గం చూపలేదు.

ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! వాస్తవానికి మేము, మిమ్మల్ని మీ శత్రువు నుండి విముక్తి కలిగించి, తూర్ పర్వతపు కుడివైపున మీతో వాగ్దానం చేసి, మీపై మన్న మరియు సల్వాలను అవతరింపజేశాము.[1]

(ఇంకా ఇలా అన్నాము): "మేము మీకు ప్రసాదించిన మంచి ఆహారపదార్థాలను తినండి,[1] అందు తలబిరుసుతనం చేయకండి, అలా చేస్తే నా ఆగ్రహానికి గురి కాగలరు. నా ఆగ్రహానికి గురి అయినవాడు తప్పక నాశనమవుతాడు.

అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో ఉంటాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను."[1]

మరియు (మూసా తూర్ పర్వతం మీద ఉన్నప్పుడు[1] అల్లాహ్ అన్నాడు): "ఓ మూసా! నీవు నీ జాతి వారిని విడిచి శీఘ్రంగా (ఇక్కడికి) వచ్చిన కారణమేమిటి?"

(మూసా) జవాబిచ్చాడు: "అదిగో! వారు నా వెనుక నా అడుగు జాడలలో వస్తూనే ఉన్నారు; నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని, ఓ నా ప్రభూ! నేను త్వరత్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను."[1]

(అల్లాహ్) అన్నాడు "వాస్తవానికి! నీ వెనుక మేము, నీ జాతి వారిని పరీక్షకు గురి చేశాము మరియు సామిరి వారిని మార్గభ్రష్టులుగా చేశాడు."

ఆ తరువాత మూసా కోపంతోనూ, విచారంతోనూ, తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఏమీ? ఒడంబడిక పూర్తి కావటంలో ఏమైనా ఆలస్య మయ్యిందా? లేదా! మీ ప్రభువు యొక్క ఆగ్రహం మీపై విరుచుకు పడాలని కోరుతున్నారా? అందుకేనా మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగ పరచారు?"

వారు అన్నారు: "మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. కాని మాపై ప్రజల ఆభరణాల భారం మోపబడి ఉండెను, దానిని (అగ్నిలోకి) విసిరాము, ఇదే విధంగా సామిరి కూడా వేశాడు."

తరువాత అతడు (సామిరి) వారికొక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేశాడు. దాని నుండి ఆవుదూడ అరుపు వంటి శబ్దం వచ్చేది.[1] పిదప వారన్నారు: "ఇదే మీ ఆరాధ్య దైవం మరియు మూసా యొక్క ఆరాధ్య దైవం కూడాను, కాని అతను దానిని మరచిపోయాడు."

ఏమీ? అది వారికెలాంటి సమాధానమివ్వజాలదనీ మరియు వారికెలాంటి కీడు గానీ, మేలు గానీ చేయజాలదనీ వారు చూడటం లేదా?"[1]

మరియు వాస్తవానికి హారూన్ ఇంతకు ముందు వారితో చెప్పి ఉన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! దీని (విగ్రహం)తో మీరు పరీక్షింప బడుతున్నారు. మరియు నిశ్చయంగా, ఆ అనంత కరుణామయుడే మీ ప్రభువు! కావున మీరు నన్నే అనుసరించండి మరియు నా ఆజ్ఞనే పాలించండి."

వారన్నారు: "మూసా తిరిగి మా వద్దకు వచ్చే వరకు, మేము దీనిని ఆరాధించకుండా ఉండలేము."

(మూసా, హారూన్ తో) అన్నాడు: "ఓ హారూన్! నీవు వారిని మార్గభ్రష్టత్వంలో పడటం చూసినప్పుడు (వారిని వారించకుండా) నిన్ను ఎవరు ఆపారు?

నీవెందుకు నన్ను అనుసరించలేదు? నీవు కూడా నా ఆజ్ఞను ఉల్లంఘించావా?"[1]

(హారూన్) అన్నాడు: "నా తల్లి కుమారుడా (సోదరుడా)! నా గడ్డాన్ని గానీ, నా తలవెంట్రుకలను గానీ పట్టి లాగకు: 'వాస్తవానికి ఇస్రాయీల్ సంతతి వారిలో విభేదాలు కల్పించావు, నీవు నా మాటను లక్ష్యపెట్టలేదు.' అని, నీవు అంటావేమోనని నేను భయపడ్డాను."[1]

(మూసా) అన్నాడు: "ఓ సామిరీ! ఇక నీ సంగతేమిటి?"

(సామిరీ) అన్నాడు: "వారు చూడని దానిని నేను చూశాను. ఆ తరువాత నేను సందేశహరుని (జిబ్రీల్)[1] పాదగుర్తుల నుండి ఒక పిడికెడు (మట్టి) తీసుకొని దాని (ఆవుదూడ విగ్రహం) మీద వేశాను మరియు నా ఆత్మ నన్ను ఈ విధంగా ప్రేరేపించింది."

(మూసా) అన్నాడు: "సరే వెళ్ళిపో! నిశ్చయంగా, నీ శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం 'నన్ను ముట్టవద్దు' (లా మిసాస) అని, అంటూ ఉంటావు. మరియు నిశ్చయంగా, నీకు (వచ్చే జీవితంలో శిక్ష) నిర్ణయించబడి ఉంది, దాని నుండి నీవు తప్పించుకోలేవు. ఇక నీవు, భక్తుడవైన నీ ఆరాధ్యదైవాన్ని చూడు! మేము దానిని నిశ్చయంగా, కాల్చుతాము తరువాత దానిని భస్మం చేసి సముద్రంలో విసిరి వేస్తాము."[1]

నిశ్చయంగా, మీ ఆరాధ్యదైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన జ్ఞానం ప్రతి దానిని ఆవరించి ఉంది.

(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలను నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవంగా మేము, మా తరఫు నుండి నీకు హితోపదేశాన్ని (ఈ ఖుర్ఆన్ ను) ప్రసాదించాము.

దీని నుండి ముఖం త్రిప్పుకునే వాడు పునరుత్థాన దినమున (గొప్ప పాప) భారాన్ని భరిస్తాడు.

అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. పునరుత్థాన దినమున వారికా భారం ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది.

ఆ దినమున బాకా (సూర్) ఊదబడుతుంది.[1] మరియు మేము అపరాధులను ఒకచోట జమ చేస్తాము. ఆ రోజు వారి కళ్ళు (భయంతో) నీలమై పోతాయి.

వారు ఒకరితో నొకరు ఇలా గుసగుసలాడుకుంటారు: "మీరు (భూమిలో) పది (రోజుల) కంటే ఎక్కువ ఉండలేదు."[1]

వారు ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో మంచి తెలివి గలవారు: "మీరు కేవలం ఒక్క దినం మాత్రమే ఉన్నారు!" అని అంటారు.

మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: "నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు.

ఆ తరువాత దానిని (భూమిని) చదునైన మైదానంగా చేసి వేస్తాడు.

నీవు దానిలో ఎలాంటి పల్లం గానీ, మిట్టగానీ చూడలేవు."[1]

ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు.[1] అనంత కరణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు.

ఆ రోజు సిఫారసు ఏ మాత్రం పనికిరాదు. కానీ! అనంత కరుణామయుడు ఎవరికైనా అనుమతినిచ్చి, అతని మాట ఆయనకు సమ్మతమైనదైతేనే తప్ప! [1]

(ఎందుకంటే!) ఆయనకు - వారికి ప్రత్యక్షంగా నున్నది మరియు పరోక్షంగా నున్నది - అంతా తెలుసు, కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు.[1]

మరియు సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు (శాశ్వితుడు) అయిన ఆయన (అల్లాహ్) ముందు అందరి ముఖాలు నమ్రతతో వంగి ఉంటాయి. మరియు దుర్మార్గాన్ని అవలంబించినవాడు, నిశ్చయంగా, విఫలుడవుతాడు.[1]

మరియు సత్కార్యాలు చేస్తూ, విశ్వాసి అయి ఉన్న వానికి ఎలాంటి అన్యాయం గానీ, నష్టం గానీ జరుగునేమోనని భయపడే అవసరం ఉండదు.[1]

మరియు ఈ విధంగా మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో క్రమక్రమంగా అవతరింపజేశాము. మరియు ఇందులో పలురకాల హెచ్చరికలు చేశాము. బహుశా వారు దైవభీతి కలిగి ఉంటారేమోనని; లేదా! వారు ఉపదేశం గ్రహిస్తారేమోనని.[1]

అల్లాహ్ అత్యున్నతుడు, సార్వభౌముడు,[1] పరమ సత్యుడు (ఓ ముహమ్మద్!) నీకు ఖుర్ఆన్ సందేశం (వహీ) పూర్తిగా అవతరింప జేయబడే వరకు దానిని గురించి తొందరపడకు. మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి పరచు!"[2]

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఆదమ్ తో ఒక వాగ్దానం చేయించి ఉన్నాము, కాని అతడు దానిని మరచి పోయాడు మరియు మేము అతనిలో స్థిరత్వాన్ని చూడలేదు.[1]

మరియు మేము దేవదూతలతో: "ఆదమ్[1] కు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆజ్ఞాపించినపుడు ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు. అతడు నిరాకరించాడు.

అప్పుడు అన్నాము: "ఓ ఆదమ్! నిశ్చయంగా, ఇతడు నీకు మరియు నీ భార్యకు శత్రువు, కాబట్టి ఇతడిని, మీ ఇద్దరిని స్వర్గం నుండి వెడల గొట్టనివ్వకండి అలా అయితే మీరు దురవస్థకు గురి కాగలరు.[1]

నిశ్చయంగా, ఇక్కడ నీవు ఆకలి గొనవూ మరియు వస్త్రహీనుడవూ (దిగంబరుడవూ) కావు.[1]

మరియు నిశ్చయంగా, ఇందులో నీకు దాహమూ కలుగదు మరియు ఎండ కూడా తగలదు."

అప్పుడు షైతాన్ అతని మనస్సులో కలతలు రేకెత్తిస్తూ అన్నాడు: "ఓ ఆదమ్! శాశ్వత జీవితాన్ని మరియు అంతం కాని సామ్రాజ్యాన్ని, ఇచ్చే వృక్షాన్ని నీకు చూపనా?"

ఆ పిదప వారిద్దరు దాని నుండి (ఫలాన్ని) తినగానే వారిద్దరికి, వారి దిగంబరత్వం వ్యక్తం కాసాగింది.[1] మరియు వారిద్దరు స్వర్గపు ఆకులను తమ మీద కప్పుకోసాగారు. (ఈ విధంగా) ఆదమ్ తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించి, సన్మార్గం నుండి తప్పి పోయాడు.

ఆ తరువాత అతని ప్రభువు, అతనిని (తన కారుణ్యానికి) ఎన్నుకొని, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతనికి మార్గదర్శకత్వం చేశాడు.

(అల్లాహ్) అన్నాడు: "మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరి కొకరు శత్రువులై[1] ఉంటారు. కాని నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది, కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు.

మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము."

అప్పుడతను అంటాడు: "ఓ నా ప్రభూ! నన్నెందుకు గ్రుడ్డివానిగా లేపావు, వాస్తవానికి నేను (ప్రపంచంలో) చూడగలిగే వాణ్ణి కదా?"

అప్పుడు (అల్లాహ్) అంటాడు: "మా సూచనలు నీ వద్దకు వచ్చినపుడు, నీవు వాటిని విస్మరించావు. మరియు అదే విధంగా ఈ రోజు నీవు విస్మరించబడుతున్నావు."

మరియు ఈ విధంగా, మేము మితిమీరి ప్రవర్తిస్తూ, తన ప్రభువు సూచనలను విశ్వసించని వానికి ప్రతీకారం చేస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో కఠినమైనది మరియు శాశ్వతమైనది.

వీరికి పూర్వం గడిచిన ఎన్నో తరాలను మేము నాశనం చేసి ఉన్నాము. వీరు వారి నివాస స్థలాలలో తిరుగుతున్నారు. ఏమీ? దీని వలన కూడా వీరికి మార్గదర్శకత్వం లభించలేదా? నిశ్చయంగా, ఇందులో అర్థం చేసుకునే వారికి ఎన్నో సూచనలున్నాయి.

మరియు నీ ప్రభువు నుండి మొదట్లోనే ఒక గడువు కాలం నిర్ణయించబడి ఉండక పోతే, వీరికి ఈ పాటికే (శిక్ష) తప్పక విధించబడి ఉండేది. కాని (వీరి) గడువు కాలం నిర్ణయించబడి ఉంది.[1]

కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు నీవు ఓర్పు వహించు. సూర్యుడు ఉదయించక ముందు మరియు అస్తమించక ముందు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయన స్తోత్రం చెయ్యి. మరియు రాత్రి సమయాలలో మరియు పగటి వేళలలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు.[1] అప్పుడు నీపు సంతుష్టుడవవు తావు!

మేము వారిలో చాలా మందికి - వాటితో వారిని పరీక్షించటానికి - వారు అనుభవించటానికి, ఇచ్చిన ఇహలోక జీవిత శోభను నీవు కళ్ళెత్తి చూడకు.[1] నీ ప్రభువు ఇచ్చే జీవనోపాధియే అత్యుత్తమమైనది మరియు చిరకాలముండేది.[2]

మరియు నీ కుటుంబం వారిని నమాజ్ చేయమని ఆజ్ఞాపించు; మరియు స్వయంగా నీవు కూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము. మేమే నీకు జీవనోపాధిని ఇచ్చే వారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు.

మరియు వారంటారు: "ఇతను (ఈ ప్రవక్త) తన ప్రభువు నుండి ఏదైనా ఒక అద్భుత సూచన (మహిమ) ఎందుకు తీసుకురాడు?" ఏమీ? పూర్వపు గ్రంథాలలో పేర్కొనబడిన స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు రాలేదా?[1]

ఒకవేళ మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను / ముహమ్మద్ ను) పంపక ముందే వారిని శిక్షించి ఉంటే! వారు అనేవారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు? (అలా చేస్తే) నిశ్ఛయంగా, మేము - అవమానం పొంది, అగౌరవం పాలుకాక ముందే - నీ సూచనలను పాటించేవారం కదా?"[1]

వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు (తన అంతిమ ఫలితం కొరకు వేచి ఉన్నాడు. కావున మీరు కూడా వేచి ఉండండి. సరైన మార్గంలో ఉన్న వారెవరో మరియు మార్గదర్శకత్వం పొందిన వారెవరో మీరు త్వరలోనే తెలుసుకుంటారు."